జీ20 సమ్మిట్‌లో అధ్యక్షుడు జో బైడెన్‌ పాల్గొంటారు : వైట్‌ హౌస్‌ ప్రకటన

కొవిడ్‌ టెస్ట్‌ నిర్వహించగా.. రెండు సార్లూ నెగటివ్‌ వచ్చినట్లు వెల్లడి

G20 Summit.. Biden tests Covid negative again, to meet PM Modi on Friday

వాషింగ్టన్‌ః జీ20 సమ్మిట్‌ కు ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భార్య జిల్‌ బైడెన్‌ కు కరోనా వైరస్‌ పాజిటివ్‌ తేలిన విషయం తెలిసిందే. అయితే, జో బైడెన్‌ కి మాత్రం నెగటివ్‌ వచ్చింది. భార్యకు పాజిటివ్‌ రావడంతో అధ్యక్షుడు ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశాలకు హాజరవుతారో లేదో అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై తాజాగా వైట్‌ హౌస్‌ స్పష్టతనిచ్చింది. జిల్‌ బైడెన్‌కు పాజిటివ్‌ తేలడంతో అధ్యక్షుడికి సోమవారం, మంగళవారం వరుసగా కొవిడ్‌ టెస్ట్‌ నిర్వహించగా.. రెండు సార్లూ నెగటివ్‌ వచ్చినట్లు వెల్లడించింది. దీంతో బైడెన్‌ గురువారం ఢిల్లీ బయలుదేరనున్నట్లు తెలిపింది. ‘జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు అధ్యక్షుడు బైడెన్‌ గురువారం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. శుక్రవారం ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ తర్వాత శని, ఆదివారాల్లో జీ20 అధికారిక సమావేశాల్లో పాల్గొంటారు’ అని యూఎస్‌ జాతీయ భద్రతా సలహాదారు తెలిపారు.