కర్ణాటక బస్సు ప్రమాద మృతులకు అంత్యక్రియలు ..

గోవా నుండి హైదరాబాద్ కు వస్తున్న ఆరెంజ్ ట్రావెల్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన మృతులకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కర్ణాటక కలబురగిలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన లో హైదరాబాద్ కు చెందిన ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. ఈ బస్సు ప్రమాదంలో మృతిచెందిన శివకుమార్, రవళి, దీక్షిత్‌ల మృతదేహాలు పోస్టుమార్టం అనంతరం శనివారం ఉదయం 11 గంటలకు గోడేకబర్‌ కామటిపురాలోని వారి ఇళ్లకు చేరుకున్నాయి.

దీంతో గోడేకబర్‌ పరిసర ప్రాంతాల్లో విషాదం నెలకొంది. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్‌ రాథోడ్, రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, స్థానిక కార్పొరేటర్‌ లాల్‌సింగ్, మాజీ కార్పొరేటర్‌ ముఖేష్‌ సింగ్‌లు మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మధ్యాహ్నం పురానాపూల్‌ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

అసలు ఏం జరిగిందంటే.. కమలాపూర్ సమీపంలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును టెంపో ఢీకొట్టడంతో.. డీజిల్ ట్యాంకుకు మంటలు అంటుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారంతా హైదరాబాద్ వాసులే. నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అర్జున్ కుమార్.. తన కుమారుడి పుట్టినరోజు, సమ్మర్ హాలిడేస్ సందర్భంగా బంధువులతో కలిసి మొత్తం 26 మంది ఆరెంజ్ ట్రావెల్ బస్సులో సుచిత్ర- కొంపల్లి ఏరియా నుంచి మే 29వ తేదీ సాయంత్రం సమయంలో గోవా బయల్దేరి వెళ్లారు. అక్కడ వేడుకలు ఘనంగా జరుపుకొని తిరిగి బయలుదేరారు. బస్సు కర్ణాటకలోకి కలబురగి జిల్లా కమలాపూర్ రాంగ్ రూట్ లో వచ్చిన టెంపో ఒక్కసారిగా ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోవడంతో డీజిల్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 32 మంది ఉండగా.. అందులో 26 మంది ఒకే కుటుంబానికి చెందిన వారే. బస్సులోనే నలుగురు సజీవ దహనం కాగా.. మరో నలుగురు హాస్పిటల్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరింది. మరో 11 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.