ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల

ఎన్నికల కోడ్ నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలుకు నిల్చిపోయిన నిధులు విడుదలయ్యాయి. బుధవారం రాత్రి ఆసరా పథకానికి రూ.1,480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్‌ కోసం రూ.502 కోట్లు విడుదలయ్యాయి. ఈ పరిణామంతో లబ్ధిదారులకు అందజేస్తున నగదు బదిలీ పక్రియ పున: ప్రారంభమైంది. అదేవిధంగా పథకాలకు కూడా మరో రెండు రోజుల్లో నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

జనవరి నుంచి వివిధ పథకాలకు ఇవ్వాల్సిన నిధులను ప్రభుత్వం పోలింగ్ కు రెండు రోజుల ముందు విడుదల చేయాలని అనుకుంది. దీనిపై ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పింది. ఇలా నిధులు విడుదల చేస్తే కచ్చితంగా ఎన్నికలపై ప్రభావం చూపినట్టు అవుతుందని అభిప్రాయపడిందని పేర్కొంది. ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై వైసీపీ సానుభూతిపరులు, పథకాల లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఒక్కరోజు సమయం ఇచ్చి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు వేయాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడా ప్రచార ఆర్భాటాలు లేకుండా సైలెంట్గా ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది. నాయకులు కూడా దీనిపై ఎలాంటి ప్రకటనలు చేయొద్దని ఆదేశించింది.

దీనిపై కూడా ఎన్నికల సంఘం అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ఇన్ని రోజుల నుంచి ఇవ్వకుండా ఇప్పుడే ఇవ్వడానికి కారణాలు చెప్పాలని, అసలు అంత డబ్బులు ఇప్పుడు ఎక్కడ సర్దుబాటు చేస్తున్నారని ప్రశ్నించింది. ఎన్నికల సంఘం అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో పోలింగ్కు ముందు రోజు పడాల్సిన నిధులు ఖాతాల్లో జమ కాకుండా పోయాయి. అయితే కోర్టులో వాదన సందర్భంగా పోలింగ్ తర్వాత రోజు నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. దీంతో పోలింగ్ ముగియడంతో నిధుల పంపిణీ మొదలైంది.