ఏలూరు జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహంలో విద్యార్థి అనుమానాస్పద మృతి

ఏలూరు జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహంలో విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. జిల్లాలోని బుట్టాయగూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పులి రామన్నగూడెంలోని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న నాలుగో తరగతి విద్యార్థి అఖిల్‌(9) ను సోమవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణానికి పాల్పడింది ఎవరు.. ఎందుకు హత్య చేశారనే కారణాలు తెలియాల్సి ఉంది.

ఉదయం హాస్టల్ సిబ్బంది చూసి పోలీసులకు , తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుతున్న బుట్టాయగూడెం పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. విద్యార్థి మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. విద్యార్థి హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. తోటి విద్యార్థులు, వసతి గృహం సిబ్బంది, నిర్వాహకులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థికి ఎవరితో అయినా గొడవలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అఖిల్ హత్య తో మిగతా పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.