పాక్​​ మాజీ అధ్యక్షుడు పర్వేజ్​ ముషారఫ్​ ఆరోగ్య పరిస్థితి విషమం

పాక్​​ మాజీ అధ్యక్షుడు పర్వేజ్​ ముషారఫ్ ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉంది. కండరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గత మూడు వారాలుగా దుబాయ్‌లోని అమెరికన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కొన్ని రోజులుగా ఆయణ్ని వెంటిలేటర్‌పై ఉంచి లైఫ్ సపోర్టు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కోలుకునేందుకు సాధ్యం కానంత విషమంగాఉందని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఆయన అవయవాలు పని చేయడం లేదని , ఆయన కోసం ప్రార్థించాలని విజ్ఞప్తి చేశారు.

దేశ విభజనకు ముందు 1943 ఆగస్టు 11న ముషారఫ్ ఢిల్లీలో జన్మించారు. భారత్, పాకిస్థాన్ విడిపోయిన తర్వాత ఆయన కుటుంబం పాకిస్థాన్‌కు వెళ్లిపోయింది. చిన్నతనం నుంచే చురుగ్గా ఉండే ముషారఫ్.. విద్యాభ్యాసం తర్వాత సైన్యంలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి ఆ దేశాధ్యక్షుడి స్థాయికి చేరారు. పాక్‌ సైనిక దళాల ప్రధాన అధికారిగా పని చేసిన ముషారఫ్‌.. 1999లో నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. సైన్యాధ్యక్షుడిగా పాక్ పాలనా పగ్గాలు చేపట్టారు. రెండేళ్ల తర్వాత ఎన్నికల్లో గెలిచి పాక్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 2001 నుంచి 2008 వరకు పాక్ అధ్యక్షుడిగా పని చేశారు. 2008లో అభిశంసనను తప్పించుకొనేందుకు ముషారఫ్ తన పదవికి రాజీనామా చేశారు. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముషారఫ్.. 2016లో తన కుటుంబంతో కలిసి దుబాయ్‌ వెళ్లిపోయారు. ఆరేళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నారు.