పూడిమడక సముద్ర తీరంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు..

సరదాగా బీచ్ కు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతైన ఘటన అనకాపల్లి జిల్లాలోని పూడిమడక సముద్ర తీరంలో చోటుచేసుకుంది. సముద్ర తీరంలో కాసేపు సేద తీరారు. కేరింతలు కొడుతూ కోలాహలం చేశారు. సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఇంతలోనే ఊహించని ప్రమాదం. అప్పటి వరకు తమతో ఆనందంగా గడిపిన స్నేహితులను ఒక్కసారిగా సముద్రం తన ఒడిలోకి లాక్కెళ్లింది.

కళ్లముందే తమ ప్రాణ స్నేహితులు అలల తాకిడికి కొట్టుకుపోతుంటే చూస్తూ ఉండలేక.. కాపాడలేక మిగతా వాళ్లంతా గుండెలవిసేలా రోదించారు. గల్లంతైనవారిని జిల్లాలోని ఓ ఇంజనీరింగ్​ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. మొత్తం 15 మంది విద్యార్థులు బీచ్‌కు వెళ్లగా.. ఐదుగురు గల్లంతయ్యారని.. మిగతా 10 మంది క్షేమంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. గల్లంతైన వారిలో పవన్​ అనే విద్యార్థి మృతదేహాం లభ్యమైంది. మిగతా విద్యార్థుల కోసం గజఈతగాళ్ల గాలిస్తున్నారు.