కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు ఏపీవాసులు మృతి

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన వారు మృతి చెందారు. నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన కొంతమంది కలబురిగిలోని దర్గా ఉర్సుకు వెళ్లి వస్తుండగా యాదగిరి జిల్లాలో వీరు ప్రయాణిస్తున్న జీపు అదుపు తప్పి రోడ్డు ప్రక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.

మృతి చెందినవారిలో మునీర్ (40), నయామత్ (40), రమీజా బేగం (50), ముద్దత్ షీర్ (12), సుమ్మి (13) ఉన్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద విషయం తెలిసి వెలుగోడులో విషాద ఛాయలు అలముకున్నాయి.