ఢిల్లీ నిలోథి గ్రామం ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని పశ్చిమ ఢిల్లీ నిలోథి గ్రామంలోని ఓ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఘటనా స్ధలానికి పది అగ్నిమాపక యంత్రాలను తరలించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశంలో పెద్దసంఖ్యలో ప్లాస్టిక్ పైపులు నిల్వ చేసి ఉండటం విజువల్స్లో కనిపించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లిన వివరాలను ఇంకా అధికారులు వెల్లడించలేదు.
కాగా, మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ ఆవరించింది. కాగా ఈనెల 11న ఢిల్లీలోని భవానా ప్రాంతంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించగా కొద్దిరోజులకే ఈ తరహా ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.