పవన్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు..
పాట్నా ః బీహార్ లో ముంబయి వెళ్లే పవన్ ఎక్స్ప్రెస్ రైలులో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి . అప్రమత్తమైన రైల్వే అధికారులు వెంటనే మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బీహార్లోని మధుబని లో గల జయనగర్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు ముంబై బయల్దేరడానికి ముందు సిబ్బంది రైలు కోచ్లను శుభ్రం చేస్తున్నారు. ఆ సమయంలో ఏసీ కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు, సిబ్బంది మంటలను అదుపుచేశారు. ప్రమాద సమయంలో కంపార్ట్మెంట్స్లో ఉన్న కొందరు ప్రయాణికులు కిటికీల్లోంచి దూకి బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు.