దిల్సుఖ్ నగర్ బస్సు డిపోలో భారీ అగ్ని ప్రమాదం… రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం

దిల్సుఖ్ నగర్ ఆర్టీసీ బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో రెండు బస్సులు పూర్తి దగ్ధమయ్యాయి. జనవరి 22వ తేదీ సోమవారం తెల్లవారుజామున బస్ డిపోలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఎగిపడ్డాయి. భారీగా మంటలు వ్యాపించడంతో రెండు ఆర్టీసీ బస్సులు తగలబడి పూర్తి దగ్ధమయ్యాయి.

వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ తో మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వరప్రసాద్ సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ అగ్ని ప్రమాదంపై సంబంధిత అధికారులు పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.