గంధంతో అందంగా..
అందమే ఆనందం
- చర్మంపై పేరుకున్న మురికిని తొలగించవచ్చు
- రోజుకు రెండుసార్లు చేసినా సమస్య దూరం
- గంధం పొడిలో పసుపు, కర్పూరం మిశ్రమం
- బ్లాక్హెడ్స్ సమస్య మటుమాయం
పాలలో గంధం చెక్కని అరగదీసి దానికి కాస్త పంచదార కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి సవ్య అపసవ్య దిశలో మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి తొలగి పోతుంది. కాంతివంతంగా కనిపిస్తుంది.
సూర్యకిరణాల తాకిడికి ఎండ తగిలే శరీరభాగాలు రంగు మారతుంటాయి. ఇందుకు పావు కప్పు గంధం పొడి, పావుకప్పు రోజ్ వాటర్, అరచెక్క నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేయాలి.
అరగంట తరువాత ముఖాన్ని చల్లని నీటితో కడిగివేయాలి. రోజుకు రెండుసార్లు చేసినా సమస్య దూరమవుతుంది.
ముఖంపై మొటిమలకు సంబంధించిన మచ్చలు ఇబ్బందిపెడుతుంటే గంధం పొడిలో ఒక స్పూన్ పాలు, రెండు చుక్కల తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు పట్టించాలి.
ఆరాక కొన్ని నీళ్లు తీసుకుని తడుపుతూ మృదువుగా మర్దనా చేయాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి.
ఇలా చేయడం వల్ల మొటిమల సమస్యను దూరం చేసుకోవచ్చు. అంతేగాక ముఖం తాజాగా కనిపిస్తుంది.
నల్లమచ్చలు ఉన్నవారు గంధం పొడిలో స్పూన్ పసుపు, కర్పూరం కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత కడిగేయాలి.
బ్లాక్హెడ్స్ వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు రాసుకుని ఉదయాన్నే శుభ్రపరచుకోవాలి. ఇలా చేయడం వల్ల సమస్య తొలగిపోతుంది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/