వైస్సార్సీపీ ప్రభుత్వం నాపై 26 కేసులు పెట్టింది : చింతమనేని

దమ్ముంటే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి తనపై ఉన్న కేసులపై విచారణ జరిపించాలని డిమాండ్

అమరావతి: తనది ఈవ్ టీజింగ్ చేసే వయసా? అని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. బి.సింగవరంలో తనపై ఈవ్ టీజింగ్ కేసు పెట్టారని, ఇంతకంటే దారుణం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. తాను దేనికీ భయపడే వ్యక్తిని కాదని అన్నారు. ఇటీవలే ఓ ఆగంతుకుడు తనకు ఫోన్ చేసి, తనను చంపేందుకు షూటర్ ను ఏర్పాటు చేసినట్టు బెదిరించాడని చెప్పారు. బెదిరింపు కాల్ వచ్చిన ఫోన్ నంబర్, కాల్ రికార్డింగ్ తో సహా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఇంత వరకు కేసు నమోదు చేయలేదని తెలిపారు. తనను హతమార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు.

ఇప్పటి వరకు వైస్సార్సీపీ ప్రభుత్వం తనపై 26 కేసులు నమోదు చేసిందని చింతమనేని తెలిపారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. సీఎం జగన్ కు దమ్ముంటే ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి, తనపై ఉన్న కేసులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్, కొట్టు సత్యనారాయణలు తానేంటో తెలుసుకుని మాట్లాడాలని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/