తన సస్పెన్షన్‌పై ఈటలతో చర్చించలేదుః రాజాసింగ్

కార్యకర్తలకు అండగా నిలిచేందుకు ఈటల రాజేందర్ వచ్చారన్న రాజాసింగ్

etela-rajender-meet-with-raja singh

హైదరాబాద్‌ః గోషామహల్ నియోజకవర్గంలో బిజెపి కార్యకర్తలు, కార్పోరేటర్‌పై అధికార బిఆర్ఎస్ తప్పుడు కేసులు బనాయించిందని, ఈ విషయాన్ని తాము తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకు వెళ్లామని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. పోలీసులు దౌర్జన్యం చేస్తుండటంతో బిజెపి కార్యకర్తలకు అండగా నిలబడేందుకు ఈటల ఈ రోజు తన వద్దకు వచ్చారని చెప్పారు. ఈటల కార్యకర్తలు, కార్పోరేటర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారన్నారు. కార్యకర్తలకు ఆర్థికంగా, రాజకీయంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని ఈటల హామీ ఇచ్చారన్నారు. చాలారోజులుగా తామిద్దరం కలవాలనుకుంటున్నామని, కానీ ఇప్పుడు ఈటల స్వయంగా వచ్చారన్నారు.

తన సస్పెన్షన్ గురించి ఈ భేటీలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు. కానీ అంతకుముందు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు మాత్రం కేంద్ర పెద్దలతో మాట్లాడుతున్నారని తెలిపారు. తాను బిఆర్ఎస్ లోకి వెళ్తాననే వార్తలను రాజాసింగ్ కొట్టి పారేశారు. తన జీవితంలో ఆ పార్టీలోకి వెళ్లేది లేదన్నారు. తన నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్ రావు తదితరులందరినీ కలుస్తానని చెప్పారు. కానీ పార్టీ మారేది లేదన్నారు.