భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు..ఉద్రవాది హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ షోపియాన్లోని కతోహలెన్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఈరోజు ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఓ టెర్రరిస్టును మట్టుబెట్టామని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. అతడిని ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాదిగా గుర్తించామని వెల్లడించారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
మరో ఘటనలో రామ్గఢ్ సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద జరిగిన కాల్పుల్లో ఓ జవాన్ గాయపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. దీంతో సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.