కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో విషాదం : చిన్నారి ప్రాణం తీసిన స్మార్ట్ ఫోన్
ప్రస్తుతం చిన్న, పెద్ద అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఉదయం లేచిన దగ్గరి నుండి నిద్రపోయేవరకు ఎక్కువ సమయం ఫోన్లతూనే గడిపేస్తున్నారు. తాజాగా కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో స్మార్ట్ ఫోన్ చిన్నారి ప్రాణం తీసింది. సోమవారం రాత్రి త్రిస్సూర్లోని తిరువిల్వామలలో చార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతుండగా స్మార్ట్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో పత్తిపరంబుకు చెందిన ఆదిత్యశ్రీ అనే 8 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది.
గ్యాప్ లేకుండా గేమ్స్ ఆడుతుండటంతో ఫోన్ హీటెక్కినట్లు స్థానికులు చెపుతున్నారు. ఎండాకాలం కావడంతో హీట్ పెరిగి ఫోన్ పేలింది. చిన్నారి ఆదిత్యశ్రీ మృతితో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదిత్యశ్రీ తిరువిల్వామలలోని క్రైస్ట్ న్యూ లైఫ్ స్కూల్లో 3వ తరగతి చదువుతోంది. ఈ ఘటనపై పజ్యన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.