బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

అరెస్ట్ అయిన రామచంద్రపిళ్లై ఆమెకు బినామీగా ఉన్నారన్న ఈడీ

ed-summons-brs-mlc-k-kavitha

హైదరాబాద్‌ః బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తాజాగా ఆమెకు నోటీసులు జారీ చేశారు. రేపు(గురువారం) విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర పిళ్లైని రెండు రోజులపాటు ప్రశ్నించిన అధికారులు తాజాగా అరెస్ట్ చేసి కోర్టుకు పంపారు. న్యాయస్థానం ఆయనకు వారం రోజుల కస్టడీ విధించింది.

కవితకు రామచంద్రపిళ్లై బినామీ అని, ఆమెకు లబ్ధి చేకూర్చేందుకు ఆయన అన్నీ తానై వ్యవహరించారని న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. అలాగే, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ. 100 కోట్ల ముడుపులు ముట్టజెప్పిన సౌత్‌గ్రూప్‌కు చెందిన ఇండోస్పిరిట్స్ సంస్థలో కవిత తరపున పిళ్లై భాగస్వామిగా ఉన్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కవితకు నోటీసులు జారీ చేశారు. పిళ్లైతో కలిపి ఆమెను విచారిస్తారని తెలుస్తోంది. కాగా, ఇదే కేసులో గతేడాది డిసెంబరు 11న కవితను ఆమె ఇంటి వద్దే సీబీఐ అధికారులు విచారించారు.