మాల్దీవులకు ఫ్లైట్‌ బుకింగ్స్‌ నిలిపివేసిన ఈజ్‌మైట్రిప్‌

EaseMyTrip suspends all Maldives flight bookings amid row over anti-Modi posts

న్యూఢిల్లీః హిందూ మహా సముద్ర ద్వీప దేశం మాల్దీవుల్లో కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ప్రధాని మోడీ పర్యటన ఇప్పుడు సంచలనంగా మారింది. మోడీ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల మంత్రులు భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ చేసిన ట్వీట్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. దేశీయంగా పర్యటకాన్ని ప్రోత్సహించేలా మోడీ లక్షద్వీప్‌ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల్లో అధికార పార్టీ నేతలు మాల్దీవులను భారత్‌ లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించారు. బీచ్‌ టూరిజంలో తమతో పోటీపడడంలో భారత్‌ సవాళ్లు ఎదుర్కొంటోందని ఎద్దేవా చేశారు. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడుతోంది. ప్రతి ఏడాది అక్కడికి సేద తీరేందుకు వెళ్లే సెలబ్రిటీలు కూడా మాల్దీవుల సర్కార్ పై ఫైర్ అవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్ మై ట్రిప్ కీలక నిర్ణయం తీసుకుంది. మాల్దీవుల ఫ్లైట్ బుకింగ్స్‌ నిలిపివేయాలని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈజ్‌ మై ట్రిప్ సంస్థ ఢిల్లీ కేంద్రంగా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. నిషాంత్‌ పిట్టి, రికాంత్‌ పిట్టి, ప్రశాంత్‌ పిట్టి దీనిని 2008లో స్థాపించారు. ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ కూడా చర్చనీయాంశమవుతోంది.