భారీ నష్టాన్ని చవిచూసిన డాక్టర్ రేడ్డీస్
హైదరాబాద్: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఆర్థిక ఫలితాల విషయంలో అనలిస్టుల అంచనాలు తారుమారయ్యాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో భారీ నష్టం చవిచూసింది. ఈ కాలంలో కంపెనీ రూ.569.7 కోట్ల నష్టం ప్రకటించింది. 2018-19 క్యూ3లో రూ.485 కోట్ల నికరలాభం ఆర్జించింది. డిసెంబరు త్రైమాసికంలో ఆదాయం రూ.4,384 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 14 శాతం పెరుగుదల. ఇక ఎబిటా క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 24 శాతం అధికమై రూ.1,074 కోట్లుగా ఉంది. డిసెంబరు త్రైమాసికంలో అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరిచామని డాక్టర్ రెడ్డీస్ కో-చైర్మన్ జి.వి.ప్రసాద్ తెలిపారు. బలమైన ఎబిటా మార్జిన్స్ నమోదు చేశామని చెప్పారు. జి-నువారింగ్తోపాటు కొన్ని ఉత్పత్తుల బ్రాండ్ విలువ పడిపోవడం, ఆ మేరకు కేటాయింపులు చేయడం వల్ల నష్టం చవిచూడాల్సి వచ్చిందని కంపెనీ వెల్లడించింది. ఈ కేటాయింపులు రూ.1,320 కోట్లుగా ఉన్నాయని డాక్టర్ రెడ్డీస్ సీఎఫ్ఓ సౌమెన్ చక్రవర్తి, సీఈవో ఎరెజ్ ఇజ్రాయెలి సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/