డీకే అరుణ కూతురిని మోసం చేసిన కారు డ్రైవర్

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరని పెద్దలు అంటారు. అది వాస్తవం. ఎన్నో ఏళ్లుగా మనతో ఉంటూ..మనల్నే మోసం చేస్తుంటారు. ఇది చాలామందికి జరిగే ఉంటుంది. తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలైన డీకే అరుణ కూతురు శ్రుతి రెడ్డి కూడా అలాగే తన డ్రైవర్ చేతిలో మోసపోయింది.

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 14లోని ప్రేమ్‌పర్వత్‌ విల్లాస్‌లో శ్రుతి రెడ్డి నివసిస్తున్నారు. కాగా.. ఆమె దగ్గర చిన్నా అలియాస్ బీసన్న అనే వ్యక్తి.. కారు డ్రైవర్‌గా కొన్ని నెలలుగా ఎంతో నమ్మకంగా పని చేస్తున్నాడు. శ్రుతి రెడ్డి ఎటూ వెళ్లినా తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలోనే.. శ్రుతి రెడ్డి వాడే క్రెడిట్ కార్డును చిన్నా తీసుకున్నాడు. అది ఎలా తీసుకున్నాడు అనేది తెలియదు. శ్రీమహవీర్‌ జెమ్స్‌ అండ్‌ పెరల్స్‌లో ఆ కార్డును వాడుకుని రూ. 11 లక్షలు వాడుకున్నాడు.

ఈ విషయాన్ని శ్రుతి రెడ్డి కాస్త ఆలస్యంగా గమనించింది. ఆ కార్డును తనకు తెలియకుండా ఎవరు వాడారని ఆరా తీయగా.. తన కారు డ్రైవర్‌పై అనుమానం వచ్చింది. తీరా డ్రైవర్ ను అడుగగా..పొంతన లేని సమాదానాలు చెప్పుకొచ్చాడు. దీంతో అతడే కార్డు తీసాడని నిర్దారణకు వచ్చి గట్టిగా నిలదీసింది. దీంతో తానే కార్డు తీసుకుని.. డబ్బు వాడుకున్న విషయాన్ని ఒప్పుకున్నాడు. ఇతడి ఫై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు చిన్నాపై ఐపీసీ సెక్షన్ 420, 408ల కింద పోలీసులు కేసు నమోదు చేసారు.