చంద్రబాబు తో దివ్యవాణి భేటీ
మహానాడు సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న టీడీపీ పార్టీ కి దివ్యవాణి రాజీనామా పోస్ట్ షాక్ ఇచ్చింది. ‘తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ పార్టీకీ రాజీనామా చేస్తున్నాను. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని ట్విట్టర్లో ఆమె రాసుకొచ్చారు. అయితే.. ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటలకే ఆమె తన రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గారు. రాజీనామా చేస్తున్నట్లు చేసిన ట్వీట్ను డిలీట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడుతో మాట్లాడిన తర్వాత దివ్యవాణి తన రాజీనామాపై వెనక్కి తగ్గి ట్వీట్ డిలీట్ చేసినట్లు తెలిసింది.
కాగా బుధువారం ఈమె పార్టీ అధినేత చంద్రబాబు తో భేటీ అయ్యింది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లిన ఆమె, తన రాజీనామాకు దారి తీసిన కారణాలను చంద్రబాబుకు వివరించారు. ఆ తర్వాత బయటకు వచ్చిన దివ్యవాణి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఓ ట్వీట్ కనిపించిన కారణంగానే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ పోస్ట్ చేశానని వెల్లడించారు. ఇదే విషయాన్ని తాను చంద్రబాబుకు చెబితే… ఫేక్ పోస్ట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన తనకు సూచించారని తెలిపారు. తనపై విమర్శలు, విశ్లేషణలు చేసిన వారందరికీ కృతజ్ఞతలని, అలాగే తనకు రాజకీయం తెలియదంటూ వ్యాఖ్యానించిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలంటూ ఆమె వ్యాఖ్యానించారు.