మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎన్నిక చెల్లదన్న పిటిషన్‌ కొట్టివేత

V. Srinivas Goud
V. Srinivas Goud

హైదరాబాద్‌: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నిక చెల్లదన్న పిటిషన్​ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ 2019లో మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్ర రాజు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​ను కొట్టివేయడంతో శ్రీనివాస్ గౌడ్​కు ఈ కేసులో ఊరట లభించినట్లైంది.

శ్రీనివాస్​గౌడ్​ 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో​ తన​ ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని​ రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్​ వేసిన విషయం తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్‌ అధికారికి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని పిటిషన్​లో ఆయన పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని.. ఆయన ఎన్నికను రద్దు చేయాలని రాఘవేంద్ర హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ఈ కేసుపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం సోమవారం రోజున మరోసారి విచారణ జరిపి ఈ వివాదంపై తీర్పు మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఇవాళ రాఘవేంద్ర వేసిన పిటిషన్​ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.