ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
షోపియాన్: జమ్ముకశ్మీరులోని షోపియాన్లో మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తొయీబా ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్లోని అల్షిపొరా ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. మృతులను మోరిఫత్ మక్బూల్, జాజిమ్ ఫరూఖ్ అలియాస్ అబ్రార్గా గుర్తించామన్నారు. ఇరువురు లష్కరే తొయీబా ఉగ్ర సంస్థకు చెందినవారని సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ హత్యలో వారి హస్తం ఉందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని అచన్ ప్రాంతంలో బ్యాంక్ సెక్యూరిటీ గార్డు సంజయ్ శర్మను ఉగ్రవాదులు కాల్చిచంపారు. కాగా, ఆ ప్రాంతంలో గాలింపులు కొనసాగుతున్నాయని చెప్పారు.