ఆఫ్గనిస్థాన్లో కారు బాంబు పేలుడు… డిప్యూటీ గవర్నర్ మృతి
కారులో పేలుడు పదార్థాలతో వచ్చి అహ్మది కారు సమీపంలో ఆత్మాహుతి దాడి
![](https://www.vaartha.com/wp-content/uploads/2023/06/deputy-governor-of-northern-afghan-province-killed-in-car-bomb-attack-jpg.webp)
కాబూల్ః ఆఫ్గనిస్థాన్లో మంగళవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో డిప్యూటీ గవర్నర్ మృతి చెందాడు. ఉత్తర బదక్షన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ నాసిర్ అహ్మద్ అహ్మది మంగళవారం కారు బాంబు దాడిలో మరణించినట్లు ప్రావిన్షియల్ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనలో నాసిర్ అహ్మద్ అహ్మది, ఆయన డ్రైవర్ మృతి చెందారని, ఆరుగురు పౌరులు గాయపడ్డారని ప్రావిన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ అధిపతి మహజుదీన్ అహ్మదీ చెప్పారు. ఈ దాడి వెనుక ఎవరున్నారో స్పష్టంగా తెలియరాలేదన్నారు. చాలా వారాల తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన మొదటి అతిపెద్ద పేలుడు ఇది.
ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి ఓ కారులో పేలుడు పదార్థాలను నింపుకొని అహ్మది ప్రయాణిస్తున్న వాహనం సమీపంలోకి దూసుకు వచ్చి పేల్చేసుకున్నాడు. ఈ ప్రావిన్స్ లో సాంస్కృతిక, సమాచార విభాగానికి అహ్మది అధిపతిగా కూడా వ్యవహరిస్తున్నారు. కాగా, ఐసిస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తాలిబన్ ప్రభుత్వం కాబుల్ సహా వివిధ పట్టణాలలో దాడులు చేస్తోంది.