ప్రజా భవన్‌లో ప్రత్యేక పూజలు చేసి గృహ ప్రవేశం చేసిన డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కు ప్రజా భవన్ ను అధికారిక నివాసంగా ప్రభుత్వం కేటాయించడం తో ఈరోజు తెల్లవారుజామున ప్రత్యేక పూజలు చేసి గృహ ప్రవేశం చేసారు. వేద పండితులు మంత్రికి ఆశీర్వచనాలు అందించారు.

గృహ ప్రవేశం సందర్భంగా ప్రజా భవన్‌లో ప్రత్యేక అలంకరణ చేశారు. ఇక, గత ప్రభుత్వంలో ప్రగతిభవన్ సీఎం అధికారిక నివాసం ఉండగా కాంగ్రెస్ సర్కారు దాని పేరును ప్రజా భవన్‌గా మార్చిన విషయం తెలిసిందే. ప్రజాభవన్ ను డిప్యూటీ సీఎం నివాసం కోసం అప్పగిస్తున్నట్లు బుధవారం సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కొత్త క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటుకు అధికారులు స్థలాలు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రికి క్యాంప్‌ ఆఫీస్‌ లేదు. ఆయన జూబ్లీహిల్స్‌లోని తన సొంత నివాసంలోనే ఉంటున్నారు. అక్కడ క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు చేస్తే ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడతాయన్న ఉద్దేశంతో అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు.