ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్

arvind-kejriwal
arvind-kejriwal

న్యూఢిల్లీః ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలను ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈడీ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు ఈ ఉదయం విచారించింది. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ పాత్రకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈడీ తరపు న్యాయవాదులు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఈడీ అందించిన ఆధారాలను కోర్టు పరిశీలించింది.

వాదనల సందర్భంగా ఈడీ తమ వాదనలను వినిపిస్తూ… కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో తాము సమన్లు జారీ చేయడం లేదని తెలిపింది. అయితే, రానున్న రోజుల్లో ఏదైనా జరగొచ్చని చెప్పింది. ఈ నేపథ్యంలో, కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ నుంచి రక్షించడానికి ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. కేసు ప్రస్తుత పురోగతి దృష్ట్యా ఇప్పుడు తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది.