ఆగ‌స్టు 8న అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ

Debate On No-Trust Motion On August 8, PM’s Reply On August 10

న్యూఢిల్లీ: వ‌చ్చే వారం పార్ల‌మెంట్‌లో విప‌క్షాలు ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం పై చ‌ర్చ జ‌ర‌నున్న‌ది. మ‌ణిపూర్ అంశంపై ప్ర‌ధాని మోడీ ఉభ‌య‌స‌భ‌ల్లో ప్ర‌క‌ట‌న చేయ‌డం లేద‌ని, అందుకే కేంద్ర స‌ర్కార్‌పై అవిశ్వాసాన్ని ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు విప‌క్షాలు పేర్కొన్న విష‌యం తెలిసిందే. లోక్‌స‌భ‌లో ఎంపీ గౌర‌వ్‌ గ‌గోయ్ ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానాన్ని స్పీక‌ర్ బిర్లా ఆమోదించారు. అయితే ఆ అంశంపై లోక్‌స‌భ‌లో ఆగ‌స్టు 8వ తేదీన చ‌ర్చ జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. ఆ చ‌ర్చ‌కు ఆగ‌స్టు 10వ తేదీన ప్ర‌ధాని మోడీ స‌మాధానం ఇస్తార‌న్నారు. జూలై 20వ తేదీన పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మైన నాటి నుంచి రోజు ఉభ‌య‌స‌భ‌లు మ‌ణిపూర్ అంశం విష‌యంలో వాయిదా ప‌డుతూనే ఉన్నాయి. ఇవాళ తొమ్మిదో రోజు కూడా స‌భాకార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌లేదు.

అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన ఎంపీ గౌర‌వ్ గ‌గోయ్ నోటీసుపై 50 మంది స‌భ్యులు సంత‌కం చేశారు. లోక్‌స‌భ‌లో 543 మంది స‌భ్యులు ఉన్నారు. ప్ర‌స్తుతం ఎన్డీఏ బ‌లం 331. విప‌క్ష కూట‌మి ఇండియా బ‌లం 144 మంది. అయితే ఈ తీర్మానాన్ని విప‌క్షం నెగ్గ‌డం కుద‌ర‌దు. కానీ మ‌ణిపూర్ అంశంపై ప్ర‌ధాని మోడీ మాట్లాడే విధంగా చేస్తుంద‌ని విప‌క్షాలు భావిస్తున్నాయి.