మావోయిస్టుల నుంచి చంద్రబాబు కు ప్రాణహాని

Chandrababu

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు ను స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సిబిఐ అరెస్ట్ చేసి రాజమండ్రి జైలు కు తరలించిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్ట్ రెండు వారాల పాటు రిమాండ్ విధించడం తో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. చంద్రబాబు జైల్లో ఉంచడం ఎంతమంత్రం మంచిది కాదని , ఇప్పటికీ మావోయిస్టు హిట్‌లిస్ట్‌లో ఉన్న ఆయన్ను మావోయిస్టులు, వాళ్ల సానుభూతిపరులున్న జైల్లో ఉంచడంతో ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

కరడుగట్టిన నేరగాళ్లు, హంతకులు, సుపారీ గ్యాంగులు, రౌడీషీటర్లు, తీవ్ర హింసాత్మక నేరాలకు పాల్పడినవారు, గంజాయి స్మగ్లర్లు ఉన్నచోట చంద్రబాబును ఉంచటం వల్ల ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే వాదన వినిపిస్తోంది. కారాగారంలో కేటాయించిన బ్యారెక్‌లో తప్ప బయట తిరగొద్దని చంద్రబాబుకు జైలు అధికారులే సూచించినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టే ఆయన భద్రత ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉందో అర్థమవుతోంది.