ఎమ్మెల్యే కొడాలి నాని పీఏ..వేధిస్తున్నాడంటూ దళిత మహిళ ఆవేదన

ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఒంటరి మహిళ రోడ్ల ఫై తిరగడం కాదు , ఇంట్లోనూ ఉండలేని పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కామాంధులు రెచ్చిపోతున్నారని , అభం శుభం తెలియని చిన్నారుల దగ్గరి నుండి మహిళల వరకు ఎవర్ని వదిలిపెట్టడం లేదని , మహిళలపై వేదింపులు ఎక్కువ అయ్యయ్యని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే కొడాలి నాని పీఏ లక్ష్మోజీ.. తనను వేధిస్తున్నారని అదే ప్రాంతానికి చెందిన వార్డు వాలంటీర్‌ మేరుగు లలిత చెప్పడం ఇప్పుడు చర్చ గా మారింది.

విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆమె మాట్లాడుతూ..మేం గుడివాడ బాపూజీనగర్‌ 13వ వార్డులో ఉంటాం. మూడు రోజుల క్రితం బోరు వేసేందుకు కూలీలు పని చేస్తుండగా.. రోడ్డు అవతలివైపు ఉన్న రమేష్‌, సురేష్‌ వచ్చి మా సామాన్లు చెల్లాచెదురుగా పడేశారు. నాపై దాడి చేశారు. వాళ్లకు భయపడి అక్కడి నుంచి పారిపోయాను. తర్వాత వారిద్దరితోపాటు సురేష్‌ మామ సుబ్రహ్మణ్యం వచ్చారు. ముగ్గురూ కలిసి నన్ను కులం పేరుతో దూషించి అసభ్యంగా ప్రవర్తించారు. చుట్టుపక్కల వాళ్లు రావడంతో పారిపోయారు.

డయల్‌ 100కు ఫోన్‌ చేయగా.. పోలీసులు వచ్చి వివరాలు తీసుకున్నారు. సాయంత్రం సీఐ దుర్గారావు పిలిపించారు. జరిగిందంతా ఆయనకు చెప్పాను. వెంటనే బోరు పనులు ఆపేయాలని, లేకపోతే తిరిగి నీపైనే కేసు పెట్టాల్సి వస్తుందని సీఐ అన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని పీఏ లక్ష్మోజీ దగ్గరకు వెళ్లగా.. నాతో అసభ్యంగా మాట్లాడారు. లక్ష్మోజీ తన బంధువులైన రమేష్‌, సురేష్‌లకు అండగా ఉంటూ.. నన్ను బెదిరిస్తున్నారు. నాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా’ అని లలిత ఆవేదన వ్యక్తం చేసింది.