కోళ్లను చంపిందని పాముకు కరెంట్ షాక్ పెట్టిన వ్యక్తి

తన పెంపుడు కోళ్లను చంపేసిందనే కోపంతో ఓ వ్యక్తి పాముకు కరెంట్ షాక్ పెట్టిన ఘటన మధ్యప్రదేశ్‌ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ..ఘోరాడోంగ్రి తాలూకా మొర్‌డోంగ్రీ గ్రామంలోని ఓ ఇంటి పరిసరాల్లోకి పాము వచ్చి కోళ్లను కాటేసి చంపేసింది. అలాగే ఓ 2 కోడి పిల్లలను, 4 గుడ్లను మింగేసింది. కోళ్లు చనిపోయి ఉండటాన్ని గమనించిన యజమాని కోళ్ల సమీపంలో ఉన్న పామును చూసి కోపంతో ఊగిపోయాడు. ఎలాగైనా పామును చంపాలని అనుకున్నాడు. కోడి గుడ్ల డబ్బాను తీసుకొచ్చి పాము దగ్గర్లో పెట్టి .. ఆ పాము డబ్బాలోకి వెళ్లగానే మూత పెట్టి బంధించాడు.

ఆ ప్లాస్టిక్ డబ్బా మూతకు ఓ రంధ్రం చేసి ఆ రంధ్రంలో నుంచి నీళ్లు పోసి..ఆ తర్వాత కరెంట్ వైర్ ను అందులో పెట్టి స్విచ్ ఆన్ చేసాడు. కరెంట్ షాక్ తో ఆ పాము విలవిలాడుతూ కనిపించింది. దానిని చూస్తూ ఆ యజమాని సంతోష పడ్డాడు. ఇక పాము చనిపోయిందని అనుకోని దానిని బయటకు తీద్దామనుకొని దగ్గరికి వెళ్లాడు. ఈలోపు ఘటన గురించి తెలుసుకున్న స్నేక్ ఫ్రెండ్లీ సభ్యుడు భీమ్ సాహూ అక్కడికి చేరుకున్నాడు. ఆ పాము చనిపోలేదని గుర్తించాడు. దానికి ప్రధమ చికిత్స చేసి..అది మాములు స్థితికి వచ్చాక అడవిలో వదిలాడు. కరెంట్ పెట్టి ఆ పామును హింసించిన ఆ వ్యక్తిపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేసి అధికారులకు పిర్యాదు చేసారు.