TSRTC కి క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ షాక్..తక్షణమే రూ.500 కోట్లు కట్టాలంటూ నోటీసులు

TSRTC కి క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ షాకిచ్చింది. తమకు బాకీపడిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలంటూనోటీసులు జారీచేసింది. మొత్తం రూ.800 కోట్లు రావాల్సి ఉన్నా తక్షణమే రూ.500 కోట్ల చెల్లించాలని నోటీసులో పేర్కొంది. ఈ నిధులు వస్తేనే సిబ్బందికి రుణాలతో పాటు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పొదుపు నిధులు ఇచ్చే వీలుంటుందని పేర్కొంది. 15 రోజుల్లోగా డబ్బు చెల్లించాలని, లేదంటే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది.

ఆర్టీసీలో 48వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. ఉద్యోగులకు తక్కువ వడ్డీకే లోన్లు ఇవ్వడం, రిటైరైన వాళ్లకు సెటిల్మెంట్లు చేయడంతో పాటు సిబ్బందికి సంక్షేమ పథకాలు అమలు బాధ్యతను క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ చూసుకుంటుంది. ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ అయ్యే వడ్డీ, పొదుపు, లోన్ రిఫండ్ డబ్బులు నెలనెలా కట్ అవుతుంటాయి. ఆ మొత్తాన్ని అదే నెలలో 15 రోజుల్లోపు సొసైటీకి సంస్థ ఇవ్వాలి. ఉద్యోగులంతా నెలనెల సభ్యత్య రుసుము, లోన్ రికవరీ పేరిట నెలకు రూ.25కోట్ల వరకు చెల్లిస్తున్నారు. అయితే ఈ నిధులను సొసైటీకి పంపించకుండా ఆర్టీసీ యాజమాన్యమే వాడుకుంటోంది. ఆ మొత్తం సుమారు రూ.800 కోట్లు దాటిపోయింది. దీంతో సీసీఎస్ నిధులు లేక జనవరి నుంచి కార్మికులు దరఖాస్తు చేసుకున్న రుణాలను సైతం పెండింగ్‌లో పెట్టేసింది. సీసీఎస్ డబ్బులు కోరుతున్న సిబ్బందికి ఆరు నెలల గడువు ఉంటుంది. కోఆపరేటివ్ చట్టం ప్రకారం ఈ ఆరు నెలల్లో వారిని కన్విన్స్ చేయలేకపోతే 181వ రోజు ఎవరి డబ్బులు వారికి తిరిగిచ్చేయాలి. అయితే సీసీఎస్ దగ్గర నగదు నిల్వలు లేకపోవడంతో ఆర్టీసీ చెల్లించాల్సిన డబ్బులపైనే ఆశలు పెట్టుకుంది. ఆర్టీసీ మాత్రం డబ్బులు ఇవ్వకపోవడం తో ఇప్పుడు లీగల్ నోటీసులు జారీ చేసింది. మరి గడువు లోపు టీఎస్ ఆర్టీసీ ఆ డబ్బును ఇస్తుందో లేదో చూడాలి.