హోదా హామీ ఇచ్చి నెరవేర్చని బిజెపితో ఎలా జతకడుతున్నారుః సీపీఐ నారాయణ
పవన్ కల్యాణ్ ఓ రాజకీయ బ్రోకర్లా మారిపోయారు.. సీపీఐ నారాయణ
అమరావతిః ఎన్డీయే కూటమి సమావేశం కోసం ఢిల్లీకి వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సీపీఐ నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓ ఛానల్తో ఆయన మాట్లాడుతూ.. పవన్ ఓ రాజకీయ బ్రోకర్లా మారారని, టిడిపిని ఎన్డీయేకు దగ్గర చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రెండు పార్టీల మధ్య అనుసంధానం చేస్తున్నారన్నారు. అదే కనుక జరిగితే ఏపీలో వైసీపీ నెత్తిన పాలుపోసినట్లే అన్నారు. బిజెపితో జతకట్టిన కూటమికి వ్యతిరేకంగా మైనార్టీలు అందరూ ఏకమై వైఎస్ఆర్సిపిని గెలిపించడం ఖాయమన్నారు. అయితే అదే సమయంలో వైఎస్ఆర్సిపిని కూడా బిజెపి వదులుకోదన్నారు.
ప్రత్యేక హోదా హామీ ఇచ్చి, ఆ హామీని ఇప్పటి వరకు నెరవేర్చని బిజెపితో పవన్ కల్యాణ్ ఎలా అంటకాగుతారని ప్రశ్నించారు. నిన్నటి వరకు చెగువేరా దుస్తులు ధరించిన జనసేనాని ఇప్పుడు వీరసావర్కర్ దుస్తులు వేసుకోవడానికి సిద్ధపడ్డారని, రేపు గాడ్సేలా తుపాకీ పట్టుకోవడానికి కూడా సిద్ధమవుతారని ఎద్దేవా చేశారు. పవన్ రాజకీయ స్థిరత్వంపై మాట్లాడుతూ, మొదట ఆయన మూడు నిమిషాలు కదలకుండా నిలబడగలిగితే ఆ తర్వాత ఈ అంశంపై మాట్లాడుదామన్నారు.