గులాం నబీ ఆజాద్ రాజీనామాపై జైరాం ఫైర్
గులాం నబీ ఆజాద్ రాజీనామా ఫై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజీనామా చేసేందుకు ఇదా సమయం అని అన్నారు. గులాం నబీ ఆజాద్ రాజీనామా చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వివిధ అంశాలపై బిజెపి తో పోరాడుతోన్న సమయంలో ఆజాద్ పార్టీ వీడటం దురదృష్టకరమని తెలిపింది. అలాగే ఈ రాజీనామా లేఖలోని విషయాలను ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ప్రశ్నించారు. అవి వాస్తవం కాదన్నారు. రాజీనామా లేఖలో రాహుల్ గాంధీ వల్ల కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిందని గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో సంప్రదింపులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీది చిన్నపిల్లల మనస్తత్వం అంటూ చురకలు అంటించారు గులాంనబీ ఆజాద్.రాహుల్ గాంధీ సీనియర్ల అందరినీ పక్కన పెట్టేశారని తన రాజీనామా సందర్భంగా గులాం నబీ అజాద్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి రాజకీయ పరి పక్వత లేదని విమర్శలు చేశారు.
అయితే ఆజాద్ చేసిన వ్యాఖ్యల ఫై జైరాం ఆగ్రహం వ్యక్తం చేసారు. లేఖలో పేర్కొన్నవన్నీ వాస్తవం కాదన్నారు. పార్టీ నేతలందరూ ఆయనతో ఎంతో మర్యాదపూర్వకంగా ఉండేవారు. ఇలా పార్టీని వీడి వెన్నుపోటు పొడవటం వల్ల ఆయన నిజస్వరూపం బయటపడింది. జీఎన్ఏ(గులాం నబీ ఆజాద్) డీఎన్ఏ “మోడి-ఫై” అయింది” అని ట్వీట్ చేశారు.
మరోపక్క గులాం నబీ ఆజాద్ ఎప్పుడైనా మా పార్టీలోకి రావచ్చు. ఒక వేళ అధిష్ఠానం ఆ బాధ్యతలను మాకు అప్పచెబితే మేము ఆయన్ను మా పార్టీలోకి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని బిజెపి నేత కుల్దీప్ బిష్ణోయ్ అన్నారు.