ఏపీలో లోన్ యాప్..మరో ఇద్దర్ని బలి తీసుకుంది

ఆన్‌లైన్‌ రుణయాప్‌ల ఆగడాలకు మరో ఇద్దరు బలయ్యారు. అవసరానికి డబ్బు ఇస్తామని చెప్పడం..తర్వాత డబ్బులు సకాలంలో చెల్లించకపోతే వారిని ఇబ్బందికి గురి చేయడం..పలువిధాలుగా బ్లాక్ మెయిల్ చేయడం వంటివి చేయడంతో అది తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ లోన్ యాప్ వల్ల భార్య భర్తలు ఆత్మ హత్య చేసుకొని వారిని పిల్లలను అనాథలను చేసారు.

వివరాల్లోకి వెళ్తే..

అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లబ్బర్తికి చెందిన కొల్లి దుర్గారావు పదేళ్ల కిందట జీవనోపాధి నిమిత్తం రాజమహేంద్రవరం వచ్చారు. ఆరేళ్ల కిందట రమ్యలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. నగరంలోని శాంతినగర్‌లో ఉంటున్న వీరికి తేజస్వి నాగసాయి(4), లిఖితశ్రీ(2) ఇద్దరు సంతానం. దుర్గారావు పెయింటింగ్‌, రమ్యలక్ష్మి టైలరింగ్‌ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కాగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇటీవల వీరు రెండు ఆన్‌లైన్‌ రుణయాప్‌లలో కొంత మొత్తం నగదు అప్పుగా పొందారు. వాటిని నిర్ణీత సమయంలో చెల్లించకపోవడంతో యాప్‌ల నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. వారి బెదిరింపులను తాళలేక కొంత మొత్తం నగదును చెల్లించారు. మరింత చెల్లించాలని, లేదంటే రమ్యలక్ష్మి ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి సోషల్ మీడియా లో పెడతామని హెచ్చరించారు.

ఈ బాధలు తప్పించుకోవాలనే ఉద్దేశంతో దుర్గారావు పది రోజుల కిందట ఆన్‌లైన్‌ డెలివరీ బాయ్‌గా చేరి అదనపు సంపాదన కోసం ప్రయత్నించారు. ఈలోగా అసభ్యకరంగా ఉన్న ఓ చిత్రానికి రమ్యలక్ష్మి ముఖం వచ్చేలా మార్ఫింగ్‌ చేసి యాప్‌ల నిర్వాహకులు వాట్సాప్‌లో బెదిరించారు. రెండు రోజుల వ్యవధిలో పూర్తి రుణాన్ని వడ్డీతోసహా చెల్లించకుంటే ఈ చిత్రంతోపాటు అసభ్యకరంగా వీడియోను తయారు చేసి పంపుతామని హెచ్చరించారు. దాంతో గుండెపగిలిన దంపతులు ..గోదావరి గట్టున ఉన్న ఒక లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు.

మంగళవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో బావ రాజేష్‌కు రమ్యలక్ష్మి ఫోన్‌ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కాల్‌ కట్‌ చేశారు. వారు లాడ్జి వద్దకు వచ్చేసరికి దుర్గారావు దంపతులు గదిలో విష రసాయనం తాగి విగత జీవులుగా పడి ఉన్నారు. వారిని వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున గంట వ్యవధిలో ఇద్దరూ ప్రాణాలు వదిలినట్లు వైద్యులు ధ్రువీకరించారు.