ఢిల్లీలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు

బిజెపి, ఆప్ హోరాహోరీ..15 ఏళ్లుగా బిజెపి చేతుల్లోనే ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్

counting-of-votes-for-the-mcd-polls-in-delhi-began-today

న్యూఢిల్లీః ఢిల్లీ మునిసిపల్ (ఎంసీడీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ నెల 4న జరిగిన ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. మొత్తం 250 వార్డుల్లోని 1,349 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బిజెపి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ జరిగినట్టుగా చెబుతున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఆప్, బిజెపి మధ్య సాగింది. 2017లో జరిగిన ఎన్నికల్లో అప్పట్లో ఉన్న 270 స్థానాలకు గాను 181 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఆప్ 48 స్థానాలతో రెండో స్థానంలో నిలవగా కాంగ్రెస్ 30 స్థానాలతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

ఈ ఎన్నికల్లో ఆప్ విజయం పక్కా అని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇక్కడి మునిసిపల్ పీఠం 15 ఏళ్లుగా బిజెపి చేతుల్లోనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తున్నా ఎంసీడీ మాత్రం ఆ పార్టీకి అందని ద్రాక్షగానే మారింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను కేజ్రీవాల్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

ఈ క్రమంలో ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, కడపటి వార్తలు అందేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ 126, బిజెపి 120 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ ఐదు స్థానాల్లో ఉనికిలో ఉంది. ఈ లెక్కన చూస్తే బిజెపి, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య భీకర పోరు తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/