వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందిః చంద్రబాబు

వెంకటగిరిలో రా కదిలిరా సభ

Countdown has started for YSRCP government: Chandrababu

వెంకటగిరి: టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన రా కదలిరా సభకు హాజరయ్యారు. ఈ సభకు టిడిపి శ్రేణులు భారీగా తరలివచ్చాయి. చంద్రబాబు ప్రసంగించేందుకు రాగా, సీఎం సీఎం అంటూ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. దాంతో చంద్రబాబు చిరునవ్వుతో… తమ్ముళ్లూ వినాలి… అంటూ తనదైన శైలిలో ప్రసంగం కొనసాగించారు. “తమ్ముళ్లూ… మున్ముందు మనం ఆనందంతో అరిచే టైమ్ ఉంటుంది… గట్టిగా నినాదాలు చేయొచ్చు. డ్యాన్సులు చేసే అవకాశం కూడా వస్తుంది. ఇప్పుడు మాత్రం వినాలి” అంటూ సభకు వచ్చినవారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఇక తన ప్రసంగం కొనసాగిస్తూ… వైఎస్‌ఆర్‌సిపి వచ్చాక వెంకటగిరి తలరాత ఏమైనా మారిందా? అని ప్రశ్నించారు. గతంలో వైఎస్‌ఆర్‌సిపిలో ఉన్న ఆనం రామనారాయణరెడ్డే జగన్ పాలన బాగా లేదని చెప్పారని… ప్రజల మేలు కోరి మాట్లాడిన ఆనం రామనారాయణరెడ్డిని పార్టీ నుంచి దూరం పెట్టేశారని వెల్లడించారు. సీనియర్ నాయకులను కూడా లెక్కచేయని అహంకారి జగన్ అని విమర్శించారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని, మరో 82 రోజుల్లో ఈ ప్రభుత్వం దిగిపోవడం ఖాయమని అన్నారు.