టాలీవుడ్ చిత్రసీమలో మరో విషాదం : కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత

టాలీవుడ్ చిత్రసీమలో వరుస విషాదాలు ఆగడం లేదు. వరుసపెట్టి సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు,నిర్మాత, కాస్ట్యూమ్ డిజైనర్ అయిన కాస్ట్యూమ్ కృష్ణ మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన…చెన్నైలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయన పూర్తి పేరు మాదాసు కృష్ణ. కృష్ణ పేరుతో తెలుగు చిత్రసీమలో చాలా మంది ఉన్నారు. కానీ, కాస్ట్యూమ్స్ కృష్ణ అంటే గుర్తుకు వచ్చేది మాత్రం ఈయన ఒక్కరే. ఎందుకంటే… తెలుగులో అనేక సినిమాలకు ఆయన కాస్ట్యూమ్స్ అందించారు. డ్రస్ డిజైనింగ్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ సమకూర్చేవారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో ఎక్కువ రోజులు పని చేశారు. ఆ సమయంలో ఆయన్ను ‘సురేష్’ కృష్ణ అనేవారు. ఆ తర్వాత కాస్ట్యూమ్స్ కృష్ణగా ఆయన పేరు స్థిరపడింది.

1980ల్లో వచ్చిన అనేక మంది అగ్ర హీరోల సినిమాలకు ఆయన కాస్ట్యూమ్స్‌ అందించారు. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘భారత్‌ బంద్‌’ సినిమాతో కాస్ట్యూమ్స్‌ కృష్ణ నటుడిగా పరిచయమయ్యారు. . ఆ సినిమాలో కాస్ట్యూమ్ కృష్ణ విలన్‌గా నటించి మెప్పించారు. ఆ తర్వాత విలన్‌, సహాయ పాత్రల్లో నటించారు. పెళ్లి పందిరి సహా 8 చిత్రాలకు నిర్మాతగానూ ఆయన వ్యవహరించారు. చెబితే వినాలి, అల్లరి మొగుడు, దేవుళ్లు, మా ఆయన బంగారం, విలన్, పుట్టింటికి రా చెల్లి వంటి అనేక సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మరణం పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.