తెలంగాణ లో వడదెబ్బ తో కానిస్టేబుల్ మృతి

తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం తొమ్మిది లోపే భానుడు భగభగమంటున్నాడు. ఈ ఎండలకు భయపడి జనాలు ఇంట్లో నుండి బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ క్రమంలో వడదెబ్బ తో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

మూతే సంతోష్(42) అనే వ్య‌క్తి రామ‌కృష్ణాపురం పోలీసు స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా ప‌ని చేస్తున్నాడు. అయితే ఆదివారం త‌న విధుల‌ను ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 10:30 గంట‌ల స‌మ‌యంలో ఇంట్లోనే కుప్ప‌కూలిపోయాడు. దీంతో ఆ కానిస్టేబుల్‌ను కుటుంబ స‌భ్యులు ల‌క్సెట్టిపేట‌కు త‌ర‌లించారు. అక్క‌డ వైద్యులు ప‌రీక్షించి, చ‌నిపోయిన‌ట్లు నిర్ధారించారు. వ‌డ‌దెబ్బ కార‌ణంగానే మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. సంతోష్ 2000 ఏడాదిలో పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చేరారు. ఆయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.