తెలంగాణలో కాంగ్రెస్‌కు 61 నుంచి 67 సీట్లు..45 నుంచి 51 స్థానాల్లో బిఆర్ఎస్: లోక్ పోల్ సర్వే

బిజెపి 2 నుంచి 3 స్థానాలకే పరిమితమవుతుందన్న లోక్ పోల్

congress-will-win-in-telangana-says-lok-poll-survey

హైదరాబాద్‌ః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రెండు, మూడు రోజుల్లో ఎలెక్షన్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బిఆర్ఎస్ పట్టుదలతో ఉండగా… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఇతర పార్టీల నుంచి చేరికలతో కాంగ్రెస్ శిబిరం ఫుల్ జోష్ లో ఉంది. కాంగ్రెస్ సీనియర్లు కూడా గతంలో మాదిరి కాకుండా ప్రస్తుతం అందరూ కలిసికట్టుగా పని చేస్తున్నారు.

మరోవైపు ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఇంకోవైపు బిజెపికి రాష్ట్రంలో మంచి ఊపు వచ్చినా… పార్టీలో అంతర్గతంగా చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఇప్పుడు ఆ ఊపు తగ్గింది. కాంగ్రెస్, బిజెపిలు కూడా ఇప్పటికే అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ లో జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లోక్ పోల్ సంస్థ నిర్వహించిన సర్వే తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించబోతోందని సర్వేలో తేలింది. మొత్తం 119 సీట్లకు గాను కాంగ్రెస్ కు 61 నుంచి 67 సీట్లు వస్తాయని లోక్ పోల్ సర్వే తెలిపింది. బిఆర్ఎస్ పార్టీ 45 నుంచి 51 స్థానాల్లో మాత్రమే గెలుపొంది రెండో స్థానానికి పరిమితమవుతుందని వెల్లడించింది. ఎంఐఎం 6 నుంచి 8 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. బిజెపి 2 నుంచి 3 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడించింది. ఇతరులు సున్నా లేదా ఒక్క స్థానాన్ని గెలుచుకోవచ్చని తెలిపింది.

ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో ఈ సర్వేను నిర్వహించినట్టు లోక్ పోల్ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రౌండ్ సర్వే నిర్వహించినట్టు తెలిపింది. సర్వే శాంపిల్ సైజ్ 60 వేలు అని పేర్కొంది.