జమ్మూకశ్మీర్ లో రూ.20 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మోడీ

ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు. పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు సాంబా జిల్లా పల్లి గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామంలో ఏర్పాటు చేసి ఇన్టెక్ (INTACH)ఫోటో గ్యాలరీని సందర్శించడంతో ప్రధాని మోదీ తన పర్యటనను ప్రారంభించారు. అనంతరం 20 వేల కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మొదటగా ఢిల్లీ, అమృత్సర్- సర్ కాత్రా ఎక్స్ప్రెస్ వేకు శంకుస్థాపన చేశారు. జమ్మూ కాశ్మీర్ కు అభివృద్ధి అనే సందేశాన్ని తాను మోసుకొచ్చారు అని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటన చేశారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, 20వేల కోట్ల అభివృద్ధి పనులను తాను ఇవ్వాళ ప్రారంభించాలని గుర్తు చేశారు. పల్లి గ్రామం దేశంలోనే తొలి కర్బన ఉద్గారాలులేని పంచాయతీగా నిలిచిందని మోడీ అన్నారు. ఈ సంవత్సరం పంచాయతీ దినోత్సవాన్ని జమ్మూలో జరుపుకుంటామని వివరించారు.
కేంద్రం చేసిన 250 చట్టాలు కశ్మీర్లో అమలు కాలేదని, ప్రతి పౌరుడికి అధికారం కల్పించేందుకు తాము ఆ చట్టాలను అమలు చేశామని చెప్పారు. నేడు అన్ని వర్గాల ప్రజలు తమ కలలను నెరవేర్చుకోగలుగుతున్నారని, కశ్మీర్లో చాలా ఏళ్లుగా రిజర్వేషన్ల పొందని వారు ఇప్పుడు రిజర్వేషన్ల ప్రయోజనం కూడా పొందుతున్నారని మోదీ అన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రజలు మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు దూరమయ్యారని, అందుకే కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, దాంతో ప్రజలకు నేరుగా ప్రయోజనాలు అందుతున్నాయని మోదీ అన్నారు. గత రెండు, మూడేళ్లగా ఇక్కడ అభివృద్ధి పుంతలు తొక్కుతుందని ఆయన అన్నారు. అలాగే “జమ్మూ కశ్మీర్లోని యువతరానికి వాగ్దానం చేయాలనుకుంటున్నాను. మీ తల్లిదండ్రులు, తాతలు పడిన కష్టాలు మీరు ఎప్పటికీ పడనవసరం లేదు” అని మోదీ అన్నారు. భవిష్యత్తులో జమ్మూకశ్మీర్ కొత్త చరిత్రను లిఖించబోతుందని చెప్పారు.