కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణను చూడలేకే ఇలా చేస్తున్నారుః రేవంత్ రెడ్డి
చండూర్ లో కాంగ్రెస్ కార్యాలయాన్ని దగ్ధం చేసిన ఘటనపై రేవంత్ ఆగ్రహం

హైదరాబాద్ః మునుగోడు నియోజవర్గంలోని చండూర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయాలను తగులబెట్టినా, దిమ్మెలను కూల్చినా మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని అన్నారు. ఇలాంటి చర్యలతో కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకే ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు.
టిఆర్ఎస్, బిజెపి కేడర్ కుమ్మక్కై తమ కేడర్ ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని 24 గంటల్లో అరెస్ట్ చేయాలని… లేనిపక్షంలో జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు తాను ధర్నా చేస్తానని అన్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా టిఆర్ఎస్, బిజెపిలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపడతామని చెప్పారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/business/