పార్టీలో విభేదాలు పనికిరావు..పార్టీ ఎంపీలకు సోనియా వార్నింగ్

ఐకమత్యంగా ఉండాలన సోనియా గాంధీ
కాంగ్రెస్ కు పునర్వైభవం అత్యావశ్యకమని కామెంట్

న్యూఢిల్లీ : నేడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎంపీ రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలకు సోనియా గాంధీ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో విభేదాలు పనికిరావని, అందరూ ఐకమత్యంతో కలిసి పనిచేయాలని తేల్చి చెప్పారు. ఇటీవలి ఎన్నికల్లో దారుణ పరాభవాలు ఎంతో కలచివేశాయని, షాక్ కు గురిచేశాయని ఆమె అన్నారు. పార్టీని పటిష్ఠపరిచేందుకు చాలా మంది చాలా రకాల సలహాలను తనకిచ్చారని ఆమె ‘జీ23’ గ్రూపు నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. అందులో చాలా విషయాలపై తాను ఎప్పటికప్పుడు దృష్టి పెడుతూనే ఉన్నానన్నారు. ‘‘ఇటీవలి ఎన్నికల ఫలితాలు మిమ్మల్ని ఎంతలా అసంతృప్తికి గురుచేశాయో నేను అర్థం చేసుకోగలను. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనే మన సంకల్పం, చిత్తశుద్ధి, దృఢత్వానికి పరీక్ష ఎదురవుతుంది’’ అని సోనియా అన్నారు.

ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యమైంది పార్టీలో ఐకమత్యమని ఆమె స్పష్టం చేశారు. అందుకు తాను ఏం చేయడానికైనా సిద్ధమన్నారు. ఎన్నికల్లో పరాజయం తర్వాత సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేశామని, చాలా మంది చాలా సలహాలిచ్చారని గుర్తు చేశారు. ‘చింతన్ శిబిర్ (ఆత్మ పరిశీలన)’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నామని, ఇటీవలి సీడబ్ల్యూసీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం తేవడం అత్యావశ్యకమని సోనియా అన్నారు. కానీ, అది అంత తేలికైన పనేం కాదని, ఇంతకుముందుతో పోలిస్తే ఎన్నో సవాళ్లు మన ముందున్నాయని పార్టీ ఎంపీలకు సోనియా చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/