హైదరాబాద్ ఈడీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిరాహార దీక్ష..
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ని ఈడీ అధికారులు..ఈరోజు మంగళవారం కూడా విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేయడం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. ఈ దీక్షలో కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిలాల్లో , మండలాల్లో ప్రధాని మోడీ దిష్టి బొమ్మ తగలబెట్టాలని కార్య కర్తలకు పిలుపునిచ్చారు.
రాహుల్ ను నిన్న ఈడీ అధికారులు దాదాపు 10 గంటల పాటు విచారించారు. ఉదయం 11.30 గంటలకు రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి వెళితే… రాత్రి 9.30 గంటలకు ఆయన ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. మధ్యాహ్నం ఓ గంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చిన ఈడీ అధికారులు…రాహుల్ను ఏకంగా 10 గంటల పాటు విచారించారు. ఇక ఈ విచారణ ఇంకా పూర్తి కాలేదని , రేపు మంగళవారం కూడా ఈడీ ఆఫీస్ కు రావాల్సి ఉంటుందని రాహుల్ కు సమన్లు జారీ చేసారు.
మొదటి రోజు సుదీర్ఘంగా సాగిన విచారణలో భాగంగా ఈడీ అధికారులు రాహుల్ ఫై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఈడీలో సహాయ డైరెక్టర్ స్థాయి అధికారి నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్నారు. యంగ్ ఇండియన్ కంపెనీ ఏర్పాటు, నేషనల్ హెరాల్డ్ కార్యకలాపాలు, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు కాంగ్రెస్ ఇచ్చిన రుణం, నేషనల్ హెరాల్డ్లో నిధుల అంతర్గత బదిలీ వంటి అంశాలపై అధికారి రాహుల్ను విచారణలో ప్రశ్నించినట్లు సమాచారం.
ఈడీ అధికారులు అడిగిన దాదాపుగా అన్ని ప్రశ్నలకు రాహుల్ లిఖితపూర్వకంగానే సమాధానాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నిన్న రాత్రి 8.30గం. కావస్తున్నా.. రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారిస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్ పెరిగింది. పార్టీకి చెందిన సీనియర్లు ఖంగారుగా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. ఒకవేళ రాహుల్ గాంధీని ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి అనే కోణంలోనూ సమాలోచనలు జరిపారు. ఈ తరుణంలో రాహుల్ ఈడీ ఆఫీస్ నుంచి బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చి రాహుల్ నేరుగా నివాసానికి వెళ్లిపోయారు.