హైదరాబాద్ః ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా గాంధీ భవన్లో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల అయింది. ‘అభయ హస్తం’ పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. 42 పేజీల్లో, 62 ప్రధాన అంశాలతో అభయహస్తం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపొందించింది. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టో పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ రిలీజ్ చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టో తమకు బైబిల్, ఖురాన్ మరియు భగవద్గీత లాంటి దని వెల్లడించారు. ఈ మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చాక తూచా తప్పకుండా పాటిస్తామని ఆయన వెల్లడించారు. సోనియాగాంధీ కారణంగానే తెలంగాణ వచ్చిందని… కానీ ఆమె ఆశయం ఇంకా తీరలేదని స్పష్టం చేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి రాబోతుందని… భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడ్డారు.
ఇంకా ఈ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమ అమర వీరుల సంక్షేమం, వ్యవసాయం – రైతు సంక్షేమం, నీటి పారుదల, యువత – ఉపాధి కల్పన, విద్యా రంగం, వైద్య రంగం, గృహ నిర్మాణం, భూ పరిపాలన, నిత్యవసరాల పంపిణీ, విద్యుత్ రంగం, పారిశ్రామిక రంగం, టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం, మద్యపాదన విధానం, మహిళా శిశు సంక్షేమం, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, గల్ఫ్ కార్మికులు, కార్మికుల సంక్షేమం.. ఇలా చాలా అంశాలను కాంగ్రెస్ పొందుపరిచింది.
కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో ప్రధాన అంశాలివీ:
* తెలంగాణ అమరుల కుటుంబ సభ్యులకు రూ. 25 వేల పింఛను. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం * ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి 250 గజాల ఇళ్ల స్థలం * రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల పంట రుణమాఫీ * రైతులకు రూ. 3 లక్షల వడ్డీలేని రుణాలు * ‘ధరణి’ స్థానంలో ‘భూమాత’ పోర్టల్ * వార్షిక జాబ్ క్యాలెండర్ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీ * ఆడపిల్లల పెళ్లికి రూ. లక్షతోపాటు 10 గ్రాముల బంగారం * ఎస్సీ వర్గీకరణ అనంతరం కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్లు * బీసీ కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు * బీసీ సబ్ ప్లాన్. ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు * సంచార జాతులకు విద్య, ఉద్యోగ అవకాశాలతోపాటు 5 శాతం రిజర్వేషన్లు * పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సాయంతో కూడిన ‘బంగారు తల్లి పథకం’ * దివ్యాంగుల పింఛన్ రూ. 5,016కు పెంపు, ఉచిత ఆర్టీసీ ప్రయాణం * వ్యవసాయానికి 24 ఉచిత విద్యుత్పై మరింత స్పష్టత * సర్పంచుల ఖాతాల్లో పంచాయతీల అభివృద్ది నిధులు * గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు * మరణించిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ. 5 లక్షలు * బడ్జెట్లో విద్యారంగం వాటా 15 శాతానికి పెంపు * ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు * ఆరు నెలల్లోపు మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ * ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరించి మెరుగైన వైద్యం * ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ పింఛన్ విధానం * జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ. 5 వేల గౌరవ భృతి * మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు రూ. 2 లక్షలు * ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సాయం