నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

Congress manifesto released today

హైదరాబాద్: అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై తీవ్ర కసరత్తు చేసింది. ఇప్పటికే ఆరు గ్యారంటీలతో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తుండగా నేడు పూర్తి స్థాయి మేనిఫెస్టోను విడుదల చేయబోతుంది. రాష్ట్ర పర్యటనకు రాబోతున్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా(నేడు) శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయబోతుంది.

ఈ క్రమంలోనే టిపిసిసి మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసుకొని ప్రజలు, వివిధ వర్గాల నేతలు, సంఘాల అభిప్రాయాలను స్వీకరించింది. ప్రస్తుతం మహాలక్ష్మి, కాంగ్రెస్ రైతు భరోసా, తెలంగాణ గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, కాంగ్రెస్ చేయూత పేరుతో ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించగా వీటికి అదనంగా ప్రజలకు అమలు చేయగలిగే పథకాలు, హామీలను తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.

ప్రస్తుతం అమలవుతున్న కళ్యాణలక్ష్మికి అదనంగా పెళ్లి కూతురుకి తులం బంగారం ఇస్తామని పార్టీ ముఖ్యనేతలు ప్రకటించారు. మరోవైపు రైతు, నిరుద్యోగ, మైనార్టీ, బిసి డిక్లరేషన్ల పేరుతో ఆయా వర్గాలకు తామేమి చేయబోతున్నామో వివరించింది. ఈ ఆరు గ్యారెంటీలే తమ కథానాయకులు అని కాంగ్రెస్ నేతలు చెబుతున్న తరుణంలో నేటి పూర్తి స్థాయి మేనిఫెస్టోలో వీటికి అదనంగా ఎలాంటి పథకాలను ప్రకటిస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.