నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నేడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వేదికగా ఉదయం 11:30 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ‘పాంచ్ న్యాయ్’ పేరుతో మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ విడుదల చేయనున్నారు .

రేపు శనివారం రాజస్థాన్‌లోని జైపూర్, తెలంగాణలోని హైదరాబాద్‌ నగరాల్లో మెగా ర్యాలీలు నిర్వహించనున్నారు. జైపూర్‌లో జరిగే మెగా ర్యాలీలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ మేనిఫెస్టోను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. ఇక హైదరాబాద్‌లో జరిగే మెగా ర్యాలీలో రాహుల్‌ గాంధీ మేనిఫెస్టోను లాంచ్‌ చేసి ప్రసంగించనున్నారు.

మేనిఫెస్టోలో అంశాలు ఇవే అని ప్రచారం…

సామాజిక న్యాయం, రైతు న్యాయం , కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయం పేరుతో ప్రజలకు హామీ ఇవ్వనుంది. సామాజిక సమాజాల్లో కులగణన రిజర్వేషన్ల పరిమితిని తీసివేయడం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పై హామీలు ఇవ్వనుంది, అలాగే రైతు న్యాయంలో పంటకు కనీస మద్దతు ధర, రైతుల రుణమాఫీకి శాశ్వత కమిషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించనుంది కాంగ్రెస్. అలాగే వ్యవసాయంలో ఉపయోగించే వస్తువులను జీఎస్టీ నుంచి తొలగించాలని నిర్ణయించిందని సమాచారం.

అటు కార్మిక న్యాయం పేరుతో మరో హామీ ఇవ్వనుంది కాంగ్రెస్ పార్టీ కార్మికులకు ఆరోగ్యం, హక్కులు, అసంఘటిత కార్మికులకు జీవిత ప్రమాద బీమా కల్పిస్తామని భావిస్తోంది. మరోవైపు యువ న్యాయం పేరుతో మరో కీలకమైన హామీని రూపొందించింది. ఇందులో పేపర్ లీక్ లను పూర్తిగా నిరోధించే విధానం అమల్లోకి తెస్తామని, అలాగే.. రిక్రూట్మెంట్ ట్రస్టు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే.. జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి, 30 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని యువతకు హామీ ఇవ్వనుంది.

కర్ణాటక తెలంగాణలో అత్యధికంగా ప్రభావం చూపిన పథకాలను మహిళా న్యాయం పేరుతో మ్యానుఫెస్టోలో పొందుపరచండి. నిరుపేద కుటుంబాలలోని మహిళలకు లక్ష రూపాయల సాయం, కేంద్ర ప్రభుత్వంలో కొత్త రిక్రూట్మెంట్స్ లో 50 శాతం మహిళ రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వనున్నది.