రేపు టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం..

మంగళవారం (నవంబర్ 16,2021) సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరగనుంది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి.. తెలంగాణ రైతులను, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న తీరుపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

కేసీఆర్ నేతృత్వంలో దిల్లీలో రైతుదీక్ష లేదా ధర్నా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై ముప్పేట దాడికి ప్రణాళిక చేస్తున్న గులాబీ పార్టీ… వాటిపై రేపటి సమావేశంలో చర్చించనుంది. కేంద్రం వైఖరి, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, భాజపా అనుసరిస్తున్న వైఖరితో పాటు.. విపక్షాల ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలనే విషయాలపైనా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. దిల్లీ స్థాయి ఆందోళనతో పాటు.. రాష్ట్రంలో ఏ రూపంలో కొనసాగించాలో రేపు వ్యూహాలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ స‌మావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజ‌రు కానున్నారు.