అక్టోబర్ 10న తెలంగాణలో కాంగ్రెస్ బీసీ గర్జన సభ

Congress BC Garjana Sabha in Telangana on October 10

హైదరాబాద్‌ః అక్టోబర్ 10వ తేదీన తెలంగాణలో కాంగ్రెస్ బీసీ గర్జన సభ నిర్వహించనుంది. ఈ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. హైదరాబాద్ లోని షాద్ నగర్ లో ఈ సభని నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు అక్టోబర్ 10వ తేదీన బీసీ గర్జన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాధికారంలో బీసీల భాగస్వామ్యం ఉండాలని.. బీసీ గర్జన తర్వాత బీసీల్లో కొత్త ఉత్సాహం వస్తుందని అన్నారు.

వాస్తవానికి ఈ సభని సెప్టెంబర్ 9వ తేదీన పెద్ద ఎత్తున నిర్వహించాలని కాంగ్రెస్ సన్నాహాలు చేసింది. ఈ వేదికపై బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని నిర్ణయించింది. అందులో పొందుపరిచాల్సిన అంశాలపై అధ్యయనం చేసేందుకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో పీసీసీ సబ్ కమిటీ వేసింది. పిసిసి మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు ఉమ్మడి పది జిల్లాలలో సన్నాహక సమావేశాలు నిర్వహించి, ఆయా జిల్లాలో బీసీ నేతల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు సేకరించారు. అయితే కాంగ్రెస్ నాయకత్వం విన్నపంతో ఏఐసీసీ హైదరాబాదులో ఈ నెల 16న సిడబ్ల్యూసి సమావేశాలు నిర్వహించింది. 17న విజయభేరీ బహిరంగ సభను కూడా నిర్వహించడంతో ఈ బీసీ గర్జనను వాయిదా వేయవలసి వచ్చింది.