తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ వేటు

తెలంగాణ లో నవంబర్ 30 న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ వేటు వేసి షాక్ ఇచ్చింది. రంగారెడ్డి కలెక్టర్‌ హరీశ్‌, మేడ్చల్‌ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, యాదాద్రి కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, నిర్మల్‌ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, వరంగల్‌ సీపీ రంగనాథ్‌, నిజామాబాద్‌ సీపీ వి.సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ టీకే శ్రీదేవి, ఎక్సైజ్‌ శాఖ సంచాలకుడు ముషారఫ్‌ అలీతో పాటు 9 జిల్లాల నాన్‌కేడర్‌ ఎస్పీల బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్ల బదిలీకి ఈసీ ఆదేశించింది. బదిలీ అయిన శాఖలకు వెంటనే ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. రేపు సాయంత్రం 5 గంటలలోపు ప్యానల్‌కు పంపాలని ఈసీ ఆదేశించింది. అక్టోబరు 3 నుంచి 5 వరకు ఎన్నికల కమిషన్‌ అధికారులు రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ అధికారులు పలువురి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడమే ఇందుకు కారణం. ప్రతిపక్ష పార్టీలు కూడా కొందరు పోలీసు అధికారుల పనితీరును విమర్శిస్తూ వారిని మార్చాలని వినతిపత్రం సమర్పించాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందున అధికారులను మార్చే అధికారం కమిషన్‌కు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆరోపణలు వచ్చిన వారిపై ఈసీ బదిలీ వేటు వేసినట్లు తెలుస్తుంది.