ఓటేసిన మిజోరం సీఎం జొరాంతంగ

CM Zoramthanga casts vote in second try after EVM malfunction

ఐజ్వాల్‌: మిజోరం సీఎం, మిజో నేషనల్‌ ఫ్రంట్‌ చీఫ్‌ జొరాంతంగ ఎట్టకేలకు తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉదయం పోలింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఐజ్వాల్‌లోని వైఎంఏ పోలింగ్‌ కేంద్రానికి ఆయన చేరుకున్నారు. అయితే సాంకేతిక కారణాలతో ఈవీఎం మెషిన్‌ మొరాయించింది. దీంతో ముఖ్యమంత్రి కొద్దిసేపు అక్కడే నిరీక్షించారు. కానీ అది ఎంతకూ బాగుకాకపోవడంతో చేసేదేం లేక మళ్లీ వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఉదయం 11 గంటలకు మరోసారి పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన జొరాంతంగ.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మిజోరంలోని 40 స్థానాలకు ఒకే విడుతలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 8 లక్షల మంది ఓట్లర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా, 11 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 32.68 శాతం ఓటింగ్‌ నమోదయింది.