నేడు గద్వాలకు సీఎం కేసీఆర్‌

సీఎం కేసీఆర్ నేడు గద్వాల్ లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్‌ కార్యాలయం, ఎస్పీ కార్యాలయంతోపాటు BRS పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం గద్వాలలోని అయిజ రోడ్డులో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగించనున్నారు.

కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో గద్వాల పట్టణం గులాబీమయంగా మారింది. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ బీఆర్‌ఎస్‌ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లతో నిండిపోయాయి. సమీకృత కలెక్టర్‌ కార్యాలయం, ఎస్పీ కార్యాలయంతో పాటు , బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలను విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదివారం స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్‌ క్రాంతి, ఎస్పీ సృజనతో కలిసి పరిశీలించారు. జోగులాంబ గద్వాల జిల్లాకు గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలు, వాటి అమలు తీరు, పనుల పురోగతిని సీఎం ప్రజలకు వివరించడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై సభలో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అన్ని జిల్లాల్లో సిఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ప్రతివారం ఏదొక జిల్లాలో కార్యాలయాల ఏర్పాటుతో పాటు పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలకు హాజరవుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు ఎన్నికల హామీలను నెరవేర్చామని చెబుతున్నారు. తెలంగాణ ప్రగతిని ప్రజలకు వివరించేందుకు వేదికగా వాడుకుంటున్నారు.